Wednesday, April 21, 2010

మాయన్నీ తీస్క పోతారు... !

మాయన్నీ తీస్క పోతారు... !

ఇదీ శ్రీకృష్ణ కమిటీ ముందు మొన్నటికి మొన్న ఒక తెలంగాణా ఆడబిడ్డ సెప్పినట్టుగా ఒక ఇంగిలీసు పేపర్లో పేద్ద అక్షరాలతో వచ్చిన వార్త. ఇది ఎవరిని ఉద్దేశించి అంటారా? అదేమి పెత్యేకించి చెప్పబళ్లా. ఆంధ్ర రాయల సీమోళ్ళనేగా వాళ్ళు ఎప్పుడూ దెప్పి పొడిచేది?


ఏమి ఎత్తుకొని పోయినాము తల్లీ? నీ భూమి నీ దగ్గెడే గదా ఉంది. నీ చెట్లు మేమేమి నరుక్కొని పోలా కదా? నీ పైర్లు బాగా చూసుకో, మీ మడికాడే ఉంది. మేమేమి కోసుకొని పాయినామా?

మేమేమన్న నీకన్నా బావుండామని అనుకోన్నావేమో? ఈపక్క ఓసారి వచ్చి చూస్తే తెలుస్తాది. మీయి మాయి ఒకటే రకం బతుకులు తల్లీ! మీ ఎండే మాకు, మీ ఎండిన బాయినీళ్ళ గొడవలే మావీ.
ఎవరో మీ ఊరి సర్పంచి కాని వేరే నాయకులు కాని చెప్పినారని మమ్మల్ని శత్రువులు మాదిరి చూడబాక. అవన్నీ కడుపులో చల్లగా పడ్డాక మాట్లాడేవోళ్ళు చేసే పని. మనం ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నా, లేక రేపు నువ్వు తెలంగాణాలో నేను రాయలసీమలో ఉన్నా, మన సేద్ద్యెం మనదే, మన కయ్యిలకాడ పనులు మనవే. మన పిల్లలు, ఇంట్లో ముసలోళ్ళ సంగతులు చూసుకోవడం ఎలాగో తప్పదు. ఇంకెందుకు ఈ దెబ్బలాటలు? తెలంగాణా వెనక బడలేదని నేను చెప్పలా, కానీ మా సీమ కూడా మీయంతే, ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎనకబడి ఉంది. చెప్తే నమ్మవేమో. ఏంజేసేది? నువ్వు మా నేల పగుళ్ళు చూళ్ళేదు కదా? ఇంకా మా పగిలిన గుండెల సంగతులేం తెలుసుకుంటావు? వెనకబాటుతనానికి ముందు వెనుకలు ఉండవు. కాకపోతే ఓ ప్రాంతం ఎక్కువ ఎనకబడి ఇంకో ప్రాంతం తక్కువ ఎనకబడి ఉండొచ్చు.


వాస్తవాలు తెలుసుకో వేరుపడడం వాళ్ళ ఏమీ రాదని అర్థం చేసుకో చెల్లెమ్మా!

Wednesday, April 14, 2010

Seema Vaasulako Vignapthi

సీమ ప్రాంతం మారలేదు. సీమవాసుల బ్రతుకులు మారలేదు. ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు గాని, శ్రీశైలం మల్లన్న దీవేనగాని, నెల్లూరు రంగన్నకరుణ గాని మన వ్రాతను మార్చలేక పోయాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా వాదంతో ఎక్కువ నష్టపోయే అవకాశం మనకే ఉంది.

జనగళంతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయి అన్న దృఢ చిత్తంతో ఈ బ్లాగ్ను ప్రారంభించాం. సీమ వాసుల్లారా, మేల్కోండి. మీ అక్షర ఆయుధాన్ని పదును పెట్టి మీ అభిప్రాయాలు వ్రాయండి. ఎక్కువ మందిని చేర్చి చదివించండి. మన వాణి శ్రీ కృష్ణ కమిటీకి వినిపిద్దాం. మన ప్రాంత అవసరాలు తీర్చుకుందాం.

ఇట్లు సీమ సిన్నోడు.