Tuesday, April 16, 2013

రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!


రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!

వేగం పుంజుకున్నది, మార్గం సుగమమైనది, రాష్ట్రంలో అందరూ ఏదో ఒక బాట పట్టారు.

ధర్మం ఎన్ని కాళ్ళపై నడుస్తుందో కాని, ప్రతి ఒక్కరు ఎక్కడో నడుస్తూనే ఉన్నారు. మండుటెండలు రోడ్డు పైనున్న తారును కరిగిస్తుంటే, మాయదారి మాటలతో మన నాయకులు రోడ్డెక్కి ప్రజల మనసులను కరిగించే పనిలో పడ్డారు. 




'మీకోసమే' అంటూ బాబన్న పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. చెల్లెమ్మ నడక ఊరూరా సాగి, రాజన్న రాజ్యాన్ని కాంక్షిస్తున్నది. కిరణ్ బాబు 'ఇందిరమ్మ కలలను' సాకారం చేయడానికి ప్రతి జిల్లాలోనూ మారుమూల దళితవాడను ఎంచుకొని పరుగులు సాగిస్తున్నాడు. తెలంగాణా రాష్ట్ర సమితి వారు బస్సు యాత్ర చేపట్టాలనుకుంటే, ఆ ప్రాంతానికే చెందిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కారు ఎక్కేదానికి సిద్ధపడ్డారు.  కమ్యునిస్టులు, పరివార్ మిత్రులు అరుదుగా కలిసి ప్రభుత్వాన్ని కలిసి వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ చార్జీల విషయమై రోడ్డెక్కారు.










ఏది ఏమైనా, విస్మయం కలిగే రీతిలో అన్ని పార్టీల నాయకులు చంచల్ గూడ దారి పట్టారు, తృణమో పణమో 'జన నాయకునికి' ముట్ట చెప్పడానికి, గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తూ.




నడక మంచిదని ప్రతి ఒక్కరూ అంటారు. డాక్టర్లు సలహా ఇచ్చేది కూడా ఇదే. ఇదేమి గోలో కాని, అందరు నాయకుల డాక్టర్లు ఒక్కసారిగా ఇలా సలహా పడేసినట్లున్నారు. అంతా నడక మయం.  కాని ఇంట్లో గడవక, లైట్లు మండక, చేలో మోటర్లు నడవక, నింగినంటిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనలేక, పిల్లలను చదివించుకోలేక సామాన్యుడు మాత్రం ఎటూపాలుపోక దిక్కు తోచని స్థితిలో నడుస్తూనే ఉన్నాడు. చావును వెతుక్కుంటూ. కాని ఈ నడక మన మాధ్యమాలకు అవసరం లేని నడక. అందుకే ఇది ఏ పేపర్లోనూ, ఏ చానేల్లోను కనపడదు.

'నడుస్తున్నది' రవాణా రాష్ట్రమా, లేక రావణ కాష్టమా?