Friday, April 20, 2012

సీమలో కిరణ్, జగన్ పరిస్థితేంటి?




2009 తర్వాత అటు తెలంగాణా పై అనిశ్చితి, ఇటు జగన్ వేగానికి కళ్ళెం వేయలేకపోవడం, రెండూ చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్ మరణానంతర అనిశ్చితి తొలగడానికి ఓ పెద్ద మనిషిగా కొణిజేటి రోశయ్యను ముఖ్య మంత్రిగా చేసినా, అది పరిస్థుతులు సర్దుకొనేంతవరకే అవసరమైంది. ఆ "జంట అలజళ్ళను" తట్టుకోడానికి రోశయ్య చేసింది పెద్దగా ఏమి లేదు. ఆయన "అంతటి శూరుడు" అని తనూ కలగన లేదు, అధిష్టాననికీ అంత అభిప్రాయం లేదు. అప్పటి పరిస్తుతుల్లో నాన్చివేత ఒక్కటే సరైన మార్గంగా కాంగ్రెస్ ఎన్నుకొంది. కాని, తర్వాతి రోజుల్లో, పార్టీని 2014 ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఒక బలమైన నాయకుడు అవసరం అనీ, అతను తెలంగాణకు, జగన్ కు కలిపి చెక్ పెట్టేవాడిగా ఉండాలని అనుకొంది. తెలంగాణా, సీమ ప్రాంతాల్లో విజయాన్నినిర్దేశించగల ధనబలం, కండబలం ఇంక సంఖ్యాబలం గల సామాజిక వర్గం రెడ్లే. అందులోను ఒక యువ నాయకుడిని తీసుకుంటే, అటు తెలంగాణా రెడ్లను ఉద్యమం నుంచి దూరం చేయొచ్చు, ఇటు సీమలో జగన్ వైపు మొగ్గుతున్న రెడ్లను పార్టీ వైపు తిప్పుకోవచ్చు, అనే 'రెండు వైపులా పదునైన కత్తిగా' నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని హై కమాండ్ ఎంచుకొంది. కాని ఆ పాచిక పారలేదు.


సొంత పార్టీ వారే కిరణ్ పై అపనమ్మకం పెంచుకోనేటట్లు కిరణ్ వ్యవహార శైలి తయారైంది. ఎప్పుడూ తనకంటూ ఓ వర్గం లేని కిరణ్, ఎవ్వరిని దగ్గర చేర్చిన పాపాన పోని కిరణ్, ఇప్పుడు ముఖ్య మంత్రిగా 'అందరివాడు'గా ఉండాల్సినప్పుడు, ఎవ్వరికీ 'చెందనివాడు'గా తయారయ్యాడు. హైదరాబాద్ నుండి తన పీలేరు నియోజకవర్గంలోని సొంతూరు నగరిపల్లెకు వెళ్ళాలన్న కూడా, తిరుపతికి విమానంలో వచ్చి, పదిమందిని పలకరించి అక్కడనుండి పీలేరు వెళ్ళడు. హైదరాబాద్ నుండి నేరుగా బెంగళూరుకు విమానం పట్టుకొని, అటునుంచి మదనపల్లె మీదుగా పీలేరుకు వస్తాడు. తన సొంత జిల్లాలో కూడా ఆయనకు పట్టులేకపోవడానికి అదే కారణం. వై.ఎస్.ఆర్ నీడన పెరిగిన ఆయన ఇంత ఎత్తుకు ఎదుగుతామని, తనకంటూ ఓ వర్గం అవసరం అవుతుందనీ బహుసా అనుకోలేదేమో!

సీమలో, ప్రత్యేకించి కడప జిల్లాలో, రెడ్డి సామాజిక వర్గం ఇన్నేళ్ళు కాంగ్రెస్ కు వత్తాసు పలికినా, ఇప్పుడు ఎకతాటిపైన జగన్ కే మద్దతు పలికే అవకాశం మెండుగ ఉంది. కిరణ్ వెర్సస్ జగన్ అన్న పరిస్థితి వస్తే: ఇద్దరూ రెడ్లే, ఇద్దరూ దాదాపుగా యువకులే. జగన్ పెద్దాయన ఆస్తికి వారసుడైతే, కిరణ్ వై.ఎస్.ఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ధినవారు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్.ఆర్ కిరణ్ తండ్రి నల్లారి అమరనాథ రెడ్డికే సన్నిహితుడు. మరి ఈ సామాజిక విభజన ఎందుకు? ఈ వర్గానికి కాంగ్రెస్ ఏమి తక్కువ చేసిందని ఈ అలక? లేదా, జగన్ ఏమి చేస్తాడని వారి ఆశ, ఎదురుచూపు? ఇంకా చెప్పాలంటే, వై.ఎస్.ఆర్ తమ వర్గానికి చెసిన "మేలుకు" ప్రతిఫలంగా ఆయన ఋణం తీర్చుకోడానికి జగన్ కు వోటు వేయొచ్చు.


మరో వైపు ఓదార్పు పేరుతో జనం మధ్యన తిరుగుతున్న జగన్ కు అంతటా గుర్తింపు పెరుగుతోంది. అతని పైనున్న అవినీతి ఆరోపణలను నిరూపించి ముద్దాయిగా ప్రజల ముందు నిలిపే అవకాశమున్నా కాంగ్రెస్ తాత్సారంతో విఫలమయింది. దానితో "తనను వేదిస్తున్నారనే" జగన్ వాదనే నెగ్గే పరిస్థితి ఉంది.

ఈ సమస్యకు మరో పార్శ్వం ఏమంటే: పార్టీలో కోవర్టులు ఉన్నారని కొందరంటే, అది సిఎంకి కూడా వర్తిస్తుందని ఇంకొందరు గుసగుసలాడుకొంటున్నారు. జగన్ పై పల్లెత్తు మాట మాట్లాడని వైనం, తమను, తమ పార్టీని అనునిత్యం 'ఎక్కిదిగే' సాక్షి దినపత్రికకు వంద కోట్లకు పైగా ప్రకటనలు ఇవ్వడం వెనుక మతలబు కూడా ఇదేనేమో? తెర వెనుక నడుస్తున్న బాగోతం ఏమిటి? కిరణ్ లో నాయకత్వ లక్షణాలు లేవా, లేక ఆయన అది ప్రదర్శించ లేక పోతున్నారా? ఏది నిజం? పైపైకి హై కమాండ్ ను మచ్చిక చేసుకున్నా, లోలోపల జగన్ కు మేలు చేస్తున్నారా? కాంగ్రేస్ లో ఇతర కులాలకు చెందిన సీనియర్లు కుమిలిపోతున్నారు. నల్గొండలో ఈమధ్య డీసిసి అధ్యక్షుడు అన్నట్లు ఎవరు మనవారో, ఎవరు ద్రోహులో అర్థం కాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ లో. అది రాయలసీమకు కూడా వర్తిస్తుంది.

ఉప ఎన్నికలలో ఎవరిది వాపో ఎవరిది బలుపో తేలిపోతుంది!