Sunday, March 20, 2011

ఉన్మాదానికి మూగ సాక్షులు

ఉన్మాదానికి మూగ సాక్షులు



 


ట్యాంకు బండపై గంభీరంగా నిలిచి, హైదరాబాద్ నగరానికి తెలుగు కళను తెచ్చిన మహామహుల విగ్రహావళి. వాటికి మనం ఈ మధ్య అర్పించిన నివాళి ఎంతో ఘనం. మన గతాన్ని గౌరవించలేదు, భవిష్యత్తుకూ మంచి సందేశం ఇవ్వలేదు. మన సాంస్కృతిక పురోగామనానికే తిరోగమనం ఆ దుర్దినం.



అవి పలుకలేని మూగ విగ్రహాలే కావచ్చు. కాని వారికి తెలంగాణను మించిన చరిత్ర ఉంది. ఆ శిలలు  ప్రాంతీయతలను మించిన స్ఫూర్తి అందిస్తాయి. తిక్కన, నన్నయ, ఎర్రాప్రగడలకు తెలుగు తెలుసు, తెలుగు ప్రజలు తెలుసు, కాని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఉప ప్రాంతాలు తెలియవు. అంటే ఏ కారణంతో వారి విగ్రహాలు కూల్చారో కూడా తెలియని స్థితిలో వారు కూలి ఉన్నారు. కొందరైతే హుస్సేన్ సాగర్ లో మునిగి ఈ ఉన్మాదం వెనుక గల కారణాలను ఆలోచిస్తుంటారేమో? వీరిని ముంచితే తెలంగాణా ఎలా వస్తుందో కూడా వారికి అంతుపట్టదు.





కాని, తెలంగాణా ప్రాంతంలో కూడా నిస్పక్షపాతంగా ఆలోచించే సాహితీ వేత్తలు, మేధావులు ఉన్నారు. వారు లోలోపల ఈ దుశ్చర్యలపై కుళ్లుకున్నా బయట చెప్పడానికి సాహసించడం లేదు. ఇది పరోక్షంగా ఇలాంటి వారికి మద్దతు పలకడమే అవుతుంది. ఇదే బయటపడే సమయం. ప్రాంతాలకతీతంగా తెలుగు మన అందరి సొత్తు. భాష, సంప్రదాయం, సంస్కృతి మనందరికీ సొంతం. వాటిని పరిరక్షించడంలో ఈ ఘనకీర్తులు పోషించిన పాత్ర గణనీయం. దాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారు. యాసలు, అలవాట్లు మారొచ్చు. అంత మాత్రానికే ఆ పెద్దలు వారసత్వంగా ఇచ్చిన మన సంస్కృతిని మరచి వారి విగ్రహాలనే కూలగొడితే తల్లినే నరికిన అంత పని కాదా?

ఇంకో పక్క, సంగారెడ్డిలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని కూల్చి తెలంగాణా వాదులే ఇలాంటి అగ్గికి ఆజ్యం పోసారు. . వాళ్ళ జిల్లా మంత్రితో  ఉన్న  సమస్యను పరిష్కరించుకోవడానికి, పాత ద్వేషాలతో రగిలిపోతున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పేరుకేమో 
తెలంగాణా వాదం. కాని కూలగోట్టిందేమో తెలంగాణా తల్లి విగ్రహం. ఇంతటి నీచానికి ఒడిగట్టిన వారు తమ ప్రాంతానికి, ప్రజలకు ఏం మేలు చేస్తారు?
 
కూలింది ఏ విగ్రహమైనా అది పతనమవుతున్న సామాజిక మానవీయ విలువలకు తార్కాణం.