Monday, October 18, 2010

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు పై జరుగుతున్న ఆందోళన పన్నెండు రోజులకు చేరుకొంది. తిరుపతిలో లాయర్లు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారట. అక్టోబర్ పంతొమ్మిదిన (మంగళవారం) రాయలసీమ ప్రాంతపు లాయర్లు అందరూ చేరి ఒక పెద్ద సమావేశం జరుపుచున్నారు. దాదాపు ముప్పై ఏళ్ళుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం రూపుదిద్దుకుంటుంది. ఇందులో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు మరియు కడప జిల్లాలకు చెందిన 60 బార్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొంటున్నారు.

ఎక్కడో విసిరి పారేసినట్టు ఉండే ఈ సీమనుండి ప్రతి వాయిదాకు హైదరాబాదుకు వెళ్ళాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పేద బతుకులు న్యాయం పొందాలన్నా ఖర్చే ! అందుకే అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కొండయ్య మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో రాయలసీమ ప్రాంతంకోసం హై కోర్ట్ బెంచును ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాని, ఇంతవరకు అది ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వేర్పాటు ధోరణుల వల్ల జరిగే అనర్థాలు ఎన్నెన్నో. మనం మేలుకోకపోతే ఈ ఒక్క అవకాశం కూడా కోల్పోవలసి వస్తుంది.

ఇది అడ్వొకేట్లకు చెందిన సమస్యగా మాత్రమే మనం పరిగణించ కూడదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి సమస్య. మేలుకొందాం. తిరుపతికి అందరూ తరలి వెళ్దాం.