Monday, October 18, 2010

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు పై జరుగుతున్న ఆందోళన పన్నెండు రోజులకు చేరుకొంది. తిరుపతిలో లాయర్లు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారట. అక్టోబర్ పంతొమ్మిదిన (మంగళవారం) రాయలసీమ ప్రాంతపు లాయర్లు అందరూ చేరి ఒక పెద్ద సమావేశం జరుపుచున్నారు. దాదాపు ముప్పై ఏళ్ళుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం రూపుదిద్దుకుంటుంది. ఇందులో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు మరియు కడప జిల్లాలకు చెందిన 60 బార్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొంటున్నారు.

ఎక్కడో విసిరి పారేసినట్టు ఉండే ఈ సీమనుండి ప్రతి వాయిదాకు హైదరాబాదుకు వెళ్ళాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పేద బతుకులు న్యాయం పొందాలన్నా ఖర్చే ! అందుకే అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కొండయ్య మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో రాయలసీమ ప్రాంతంకోసం హై కోర్ట్ బెంచును ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాని, ఇంతవరకు అది ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వేర్పాటు ధోరణుల వల్ల జరిగే అనర్థాలు ఎన్నెన్నో. మనం మేలుకోకపోతే ఈ ఒక్క అవకాశం కూడా కోల్పోవలసి వస్తుంది.

ఇది అడ్వొకేట్లకు చెందిన సమస్యగా మాత్రమే మనం పరిగణించ కూడదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి సమస్య. మేలుకొందాం. తిరుపతికి అందరూ తరలి వెళ్దాం.

Tuesday, July 27, 2010

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

తెలంగాణా అంటేనే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఒక చర్చనీయాంశం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని కదిపినా ఆంధ్ర ప్రదేశ్లో అదో కల్లోలిత ప్రాంతం అనేంతగా ముదిరింది చర్చ. వెనుకబాటుతనానికి పర్యాయ పదంగా, వేర్పాటువాదానికి నాందిగా చెప్పుకొనే తారా స్థాయికి చేరింది ఈ చర్చ. కాని, ఈ వెనుకబాటుతనానికి పక్క ప్రాంతాల వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే నాయకులు మొత్తం సమస్యనే పక్కదోవ పట్టిస్తున్నారు అనడంలో సందేహం లేదు. తద్వారా తెలంగాణా సమస్యపై, వెనుకబాటుతనంపై అవగాహన ఉండి, సానుకూల స్పందనతో పరిష్కారానికి ముందుకు వచ్చే సీమ, ఆంధ్ర ప్రాంత మేధావులను, ప్రజా ప్రతినిధులను దూరం చేసుకుంటున్నారు. ఇది ఇతర ప్రాంత వాసులకు రుచించక పోవడమే కాదు, నొప్పి కలిగిస్తుంది కూడా.
ప్రజలకు ఉద్వేగాన్ని మాత్రమె నూరి పోసే ఇలాంటి నాయకులకు చారిత్రక వాస్తవాలు తెలియవంటే నమ్మశక్యం కాదు. నేడు సెంటిమెంటుపై ఉప ఎన్నికలు జరిగే సమయంలో 'తెలిసిన వాస్తవాలనే' తెలియనివారికీ, తెలియనట్టు నటిస్తున్నవారికి చెప్పాలని అనిపించి ఇలా బ్లాగుతున్నాను.

అసఫ్ జాహి వంశస్తుల పాలనలో నుంచీ చాలా ఏళ్ళు మగ్గిన తెలంగాణా ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో "వెనుకబాటు పాట" పాడుతోంది. దొరల అహంకారం, రజాకర్ల కరుకుదనం, చలి చీమల చేతకానితనం కలగలిసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో తోసాయి. పూట గడవడమే కష్టమన్న స్థితిలో దాదాపు ప్రతి కుగ్రామంలోను పదుల సంఖ్యలో ఇళ్లు ఉండేవి. అవసరానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నవారు ప్రతి తాలూకాకు ఓ ఇద్దరో ముగ్గురో ఉండేవారు. ఇలా సంపద సమానంగా పంచబడక ధనిక పేద వర్గాల మధ్య అంతరం పెరిగింది. కారణాలు ఏవైనా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఖనిజ సంపద గల భూమి బీడుగా మారింది.

మరోపక్క, మద్రాసు ప్రెసిడెన్సి పాలనలో ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలు బ్రిటిషువారి చేత చావుదెబ్బలు తిన్నా క్రమశిక్షణతో కూడిన అభివృద్ధిని చవిచూసాయి. రహదారులు, రైళ్ళు, గుళ్ళు, బళ్ళు, బ్యారేజిలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వెలసి సుభిక్షంగా ఉన్నాయి. మొత్తానికి బాగుపడ్డాయి.
మద్యం పై నిజాం పాలనలో నిషేధం లేదు కాని, పన్ను ఉండేది. అందువల్ల, మద్యం ద్వారా ప్రభుత్వ రాబడి బాగా పెరిగింది, కాని, మధ్యసేవనంవల్ల ప్రజలు ఇంకా బక్కచిక్కి పోయారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రిటిష్ పాలనలో మధ్య నిషేధం విధించి ప్రజలను మంచి మార్గంలో పెట్టి, వారి శక్తియుక్తులను సమాజ శ్రేయస్సు కొరకు వాడుకొన్నారు. ఇక్కడ అందరూ బాగుపడ్డారు.

స్వతంత్రం వచ్చే నాటికి కూడా తెలంగాణా (అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం) వేరుగా ఉన్నది. బ్రిటిష్ పాలనలో లేని ప్రాంతం తెల్లదొరలు విడిచి వెళ్ళే దేశంలో ఎందుకు చేరాలని బుకాయించింది, మొరాయించింది, తెగేసి వాదించింది. చివరకు దాదాపు మరో దశాబ్దం తెలంగాణా ప్రజల ఆకలి ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. అప్పటికే అభివృద్ధి ఏ కోశానా కనపడలేదు. ఇంతకీ అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ తన సొంత కరెన్సీతో తన సొంత బ్యాంకునే నడిపేవాడు అన్నది కొసమెరుపు!

రాష్ట్రాల సమీకరణకు పునరేకీకరణకు సమయం ఆసన్నమైనప్పుడు హైదరాబాద్ను ఆంధ్రతో కలపాలన్న ఆలోచన తెలంగాణా సామ్రాజ్య పాలకుల్లో నైరాశ్యాన్ని నింపింది. అప్పటికే బాగా అభివృద్ధి చెందినట్టువంటి సీమ, ఆంధ్ర ప్రాంతాలను చూసి ఒక రకమైన ఆత్మ న్యూనత భావంతో తల్లడిల్లి పోయారు. ఎక్కడో పొరపాటు జరిగింది అని గ్రహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని సుఖమయమైన జీవితం అనుభవించిన రాచరికపు వారసులకు, వారికి సపర్యలు చేస్తూ బతికేసిన దొరలకు ఇప్పుడు తమచే పాలింపబడ్డవారికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి. అలాగే, ఈ పునరేకీకరణ ప్రక్రియ నుంచి కూడా బయటపడాలన్న దురాలోచన. వెరసి 'తెలంగాణావాదం' ఉదయించింది. అప్పటికే అంధకారంలో ఉన్న తెలంగాణా ప్రజలు వాస్తవాలు గ్రహించలేక పోయారు. దొరలు చెప్పినవే తరాలుగా విన్న వారు, ఇదికూడా 'శ్రద్ధగా' విన్నారు, వంట బట్టించుకున్నారు. వాస్తవమనుకున్నారు. తమ పేదరికానికి పాలకులు కారణం కాదన్న భావనకు వచ్చేసారు. ఇంకేం? దొరల పాచిక పారింది. ప్రజల పేరిట ఉద్యమం ప్రారంభించారు. నేటికీ వారిని మోసం చేస్తూ వారి పేరుతోనే విప్లవాలు సాగిస్తూ, వారినే సమిధలుగా చేస్తున్నారు. నేటి పరిస్థితికి వస్తే, ముక్కు పచ్చలారని పిల్లలు కూడా 'ముక్కు' వీరుల ఆక్రోశపు మాటలకు ఆకర్షితులై, ఆవేశానికిలోనై అశువులు బాస్తున్నారు. పాపం, వీరికి ఎవరు వాస్తవాలు చెప్పాలి? ఎవరు చెబితే వింటారు?

పోరాటం తప్పు కాదు. దానికి ఏ నాయకుడు అక్కర్లేదు. కాని తప్పుదోవ పట్టించిన వారిని ఇప్పటికైనా చీదరించుకుని, దిద్దుబాటు చేసుకుంటే చాలు. ప్రాంతాల అభివృద్ధి స్వయం పాలనలో కాదు, మేటి పాలనతో వస్తుంది. ఒక శతాబ్దం పాటు వెనుకబాటుకు గురయి, ఇప్పటికిప్పుడు మేలుకొని 'మేము వెనుకబడ్డాం మొర్రో, దీనికి సీమాంధ్ర వలసవాదులే కారణంరా బాబూ ' అంటే అది వాస్తవ విరుద్ధం. మెదడుకు ఎక్కదు.
ప్రజలే కోరుకుంటే స్వరాజ్యం కాదు, సురాజ్యం కూడా సులభంగా సాధించుకోవచ్చు. ఈ సిన్నోడి మాటలు జరా ఆలకించు తెలంగాణా బ్రదరూ!

Wednesday, April 21, 2010

మాయన్నీ తీస్క పోతారు... !

మాయన్నీ తీస్క పోతారు... !

ఇదీ శ్రీకృష్ణ కమిటీ ముందు మొన్నటికి మొన్న ఒక తెలంగాణా ఆడబిడ్డ సెప్పినట్టుగా ఒక ఇంగిలీసు పేపర్లో పేద్ద అక్షరాలతో వచ్చిన వార్త. ఇది ఎవరిని ఉద్దేశించి అంటారా? అదేమి పెత్యేకించి చెప్పబళ్లా. ఆంధ్ర రాయల సీమోళ్ళనేగా వాళ్ళు ఎప్పుడూ దెప్పి పొడిచేది?


ఏమి ఎత్తుకొని పోయినాము తల్లీ? నీ భూమి నీ దగ్గెడే గదా ఉంది. నీ చెట్లు మేమేమి నరుక్కొని పోలా కదా? నీ పైర్లు బాగా చూసుకో, మీ మడికాడే ఉంది. మేమేమి కోసుకొని పాయినామా?

మేమేమన్న నీకన్నా బావుండామని అనుకోన్నావేమో? ఈపక్క ఓసారి వచ్చి చూస్తే తెలుస్తాది. మీయి మాయి ఒకటే రకం బతుకులు తల్లీ! మీ ఎండే మాకు, మీ ఎండిన బాయినీళ్ళ గొడవలే మావీ.
ఎవరో మీ ఊరి సర్పంచి కాని వేరే నాయకులు కాని చెప్పినారని మమ్మల్ని శత్రువులు మాదిరి చూడబాక. అవన్నీ కడుపులో చల్లగా పడ్డాక మాట్లాడేవోళ్ళు చేసే పని. మనం ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నా, లేక రేపు నువ్వు తెలంగాణాలో నేను రాయలసీమలో ఉన్నా, మన సేద్ద్యెం మనదే, మన కయ్యిలకాడ పనులు మనవే. మన పిల్లలు, ఇంట్లో ముసలోళ్ళ సంగతులు చూసుకోవడం ఎలాగో తప్పదు. ఇంకెందుకు ఈ దెబ్బలాటలు? తెలంగాణా వెనక బడలేదని నేను చెప్పలా, కానీ మా సీమ కూడా మీయంతే, ఇంకా చెప్పాలంటే మీకన్నా ఎనకబడి ఉంది. చెప్తే నమ్మవేమో. ఏంజేసేది? నువ్వు మా నేల పగుళ్ళు చూళ్ళేదు కదా? ఇంకా మా పగిలిన గుండెల సంగతులేం తెలుసుకుంటావు? వెనకబాటుతనానికి ముందు వెనుకలు ఉండవు. కాకపోతే ఓ ప్రాంతం ఎక్కువ ఎనకబడి ఇంకో ప్రాంతం తక్కువ ఎనకబడి ఉండొచ్చు.


వాస్తవాలు తెలుసుకో వేరుపడడం వాళ్ళ ఏమీ రాదని అర్థం చేసుకో చెల్లెమ్మా!

Wednesday, April 14, 2010

Seema Vaasulako Vignapthi

సీమ ప్రాంతం మారలేదు. సీమవాసుల బ్రతుకులు మారలేదు. ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సులు గాని, శ్రీశైలం మల్లన్న దీవేనగాని, నెల్లూరు రంగన్నకరుణ గాని మన వ్రాతను మార్చలేక పోయాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణా వాదంతో ఎక్కువ నష్టపోయే అవకాశం మనకే ఉంది.

జనగళంతోనే ప్రభుత్వాలు దిగి వస్తాయి అన్న దృఢ చిత్తంతో ఈ బ్లాగ్ను ప్రారంభించాం. సీమ వాసుల్లారా, మేల్కోండి. మీ అక్షర ఆయుధాన్ని పదును పెట్టి మీ అభిప్రాయాలు వ్రాయండి. ఎక్కువ మందిని చేర్చి చదివించండి. మన వాణి శ్రీ కృష్ణ కమిటీకి వినిపిద్దాం. మన ప్రాంత అవసరాలు తీర్చుకుందాం.

ఇట్లు సీమ సిన్నోడు.