Tuesday, July 27, 2010

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

ఇదీ తెలంగాణా 'వెనుకబాట' చరిత్ర!

తెలంగాణా అంటేనే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఒక చర్చనీయాంశం. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎవరిని కదిపినా ఆంధ్ర ప్రదేశ్లో అదో కల్లోలిత ప్రాంతం అనేంతగా ముదిరింది చర్చ. వెనుకబాటుతనానికి పర్యాయ పదంగా, వేర్పాటువాదానికి నాందిగా చెప్పుకొనే తారా స్థాయికి చేరింది ఈ చర్చ. కాని, ఈ వెనుకబాటుతనానికి పక్క ప్రాంతాల వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే నాయకులు మొత్తం సమస్యనే పక్కదోవ పట్టిస్తున్నారు అనడంలో సందేహం లేదు. తద్వారా తెలంగాణా సమస్యపై, వెనుకబాటుతనంపై అవగాహన ఉండి, సానుకూల స్పందనతో పరిష్కారానికి ముందుకు వచ్చే సీమ, ఆంధ్ర ప్రాంత మేధావులను, ప్రజా ప్రతినిధులను దూరం చేసుకుంటున్నారు. ఇది ఇతర ప్రాంత వాసులకు రుచించక పోవడమే కాదు, నొప్పి కలిగిస్తుంది కూడా.
ప్రజలకు ఉద్వేగాన్ని మాత్రమె నూరి పోసే ఇలాంటి నాయకులకు చారిత్రక వాస్తవాలు తెలియవంటే నమ్మశక్యం కాదు. నేడు సెంటిమెంటుపై ఉప ఎన్నికలు జరిగే సమయంలో 'తెలిసిన వాస్తవాలనే' తెలియనివారికీ, తెలియనట్టు నటిస్తున్నవారికి చెప్పాలని అనిపించి ఇలా బ్లాగుతున్నాను.

అసఫ్ జాహి వంశస్తుల పాలనలో నుంచీ చాలా ఏళ్ళు మగ్గిన తెలంగాణా ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో "వెనుకబాటు పాట" పాడుతోంది. దొరల అహంకారం, రజాకర్ల కరుకుదనం, చలి చీమల చేతకానితనం కలగలిసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో తోసాయి. పూట గడవడమే కష్టమన్న స్థితిలో దాదాపు ప్రతి కుగ్రామంలోను పదుల సంఖ్యలో ఇళ్లు ఉండేవి. అవసరానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నవారు ప్రతి తాలూకాకు ఓ ఇద్దరో ముగ్గురో ఉండేవారు. ఇలా సంపద సమానంగా పంచబడక ధనిక పేద వర్గాల మధ్య అంతరం పెరిగింది. కారణాలు ఏవైనా, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఖనిజ సంపద గల భూమి బీడుగా మారింది.

మరోపక్క, మద్రాసు ప్రెసిడెన్సి పాలనలో ఉన్న రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాలు బ్రిటిషువారి చేత చావుదెబ్బలు తిన్నా క్రమశిక్షణతో కూడిన అభివృద్ధిని చవిచూసాయి. రహదారులు, రైళ్ళు, గుళ్ళు, బళ్ళు, బ్యారేజిలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని వెలసి సుభిక్షంగా ఉన్నాయి. మొత్తానికి బాగుపడ్డాయి.
మద్యం పై నిజాం పాలనలో నిషేధం లేదు కాని, పన్ను ఉండేది. అందువల్ల, మద్యం ద్వారా ప్రభుత్వ రాబడి బాగా పెరిగింది, కాని, మధ్యసేవనంవల్ల ప్రజలు ఇంకా బక్కచిక్కి పోయారు. సరిగ్గా ఇదే సమయంలో బ్రిటిష్ పాలనలో మధ్య నిషేధం విధించి ప్రజలను మంచి మార్గంలో పెట్టి, వారి శక్తియుక్తులను సమాజ శ్రేయస్సు కొరకు వాడుకొన్నారు. ఇక్కడ అందరూ బాగుపడ్డారు.

స్వతంత్రం వచ్చే నాటికి కూడా తెలంగాణా (అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం) వేరుగా ఉన్నది. బ్రిటిష్ పాలనలో లేని ప్రాంతం తెల్లదొరలు విడిచి వెళ్ళే దేశంలో ఎందుకు చేరాలని బుకాయించింది, మొరాయించింది, తెగేసి వాదించింది. చివరకు దాదాపు మరో దశాబ్దం తెలంగాణా ప్రజల ఆకలి ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. అప్పటికే అభివృద్ధి ఏ కోశానా కనపడలేదు. ఇంతకీ అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ తన సొంత కరెన్సీతో తన సొంత బ్యాంకునే నడిపేవాడు అన్నది కొసమెరుపు!

రాష్ట్రాల సమీకరణకు పునరేకీకరణకు సమయం ఆసన్నమైనప్పుడు హైదరాబాద్ను ఆంధ్రతో కలపాలన్న ఆలోచన తెలంగాణా సామ్రాజ్య పాలకుల్లో నైరాశ్యాన్ని నింపింది. అప్పటికే బాగా అభివృద్ధి చెందినట్టువంటి సీమ, ఆంధ్ర ప్రాంతాలను చూసి ఒక రకమైన ఆత్మ న్యూనత భావంతో తల్లడిల్లి పోయారు. ఎక్కడో పొరపాటు జరిగింది అని గ్రహించారు. కళ్ళకు గంతలు కట్టుకొని సుఖమయమైన జీవితం అనుభవించిన రాచరికపు వారసులకు, వారికి సపర్యలు చేస్తూ బతికేసిన దొరలకు ఇప్పుడు తమచే పాలింపబడ్డవారికి సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి. అలాగే, ఈ పునరేకీకరణ ప్రక్రియ నుంచి కూడా బయటపడాలన్న దురాలోచన. వెరసి 'తెలంగాణావాదం' ఉదయించింది. అప్పటికే అంధకారంలో ఉన్న తెలంగాణా ప్రజలు వాస్తవాలు గ్రహించలేక పోయారు. దొరలు చెప్పినవే తరాలుగా విన్న వారు, ఇదికూడా 'శ్రద్ధగా' విన్నారు, వంట బట్టించుకున్నారు. వాస్తవమనుకున్నారు. తమ పేదరికానికి పాలకులు కారణం కాదన్న భావనకు వచ్చేసారు. ఇంకేం? దొరల పాచిక పారింది. ప్రజల పేరిట ఉద్యమం ప్రారంభించారు. నేటికీ వారిని మోసం చేస్తూ వారి పేరుతోనే విప్లవాలు సాగిస్తూ, వారినే సమిధలుగా చేస్తున్నారు. నేటి పరిస్థితికి వస్తే, ముక్కు పచ్చలారని పిల్లలు కూడా 'ముక్కు' వీరుల ఆక్రోశపు మాటలకు ఆకర్షితులై, ఆవేశానికిలోనై అశువులు బాస్తున్నారు. పాపం, వీరికి ఎవరు వాస్తవాలు చెప్పాలి? ఎవరు చెబితే వింటారు?

పోరాటం తప్పు కాదు. దానికి ఏ నాయకుడు అక్కర్లేదు. కాని తప్పుదోవ పట్టించిన వారిని ఇప్పటికైనా చీదరించుకుని, దిద్దుబాటు చేసుకుంటే చాలు. ప్రాంతాల అభివృద్ధి స్వయం పాలనలో కాదు, మేటి పాలనతో వస్తుంది. ఒక శతాబ్దం పాటు వెనుకబాటుకు గురయి, ఇప్పటికిప్పుడు మేలుకొని 'మేము వెనుకబడ్డాం మొర్రో, దీనికి సీమాంధ్ర వలసవాదులే కారణంరా బాబూ ' అంటే అది వాస్తవ విరుద్ధం. మెదడుకు ఎక్కదు.
ప్రజలే కోరుకుంటే స్వరాజ్యం కాదు, సురాజ్యం కూడా సులభంగా సాధించుకోవచ్చు. ఈ సిన్నోడి మాటలు జరా ఆలకించు తెలంగాణా బ్రదరూ!