Saturday, August 23, 2014

విదూషక శిఖామణి..!


బఫూన్ అనే ఒక చిన్న పదం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఎందుకలాగా? 


బఫూన్ అనే స్థాయిలో ప్రభుత్వ పక్షం నడుచుకొందా? లేక బఫూన్ అని తిట్టెంత స్థాయిలో ప్రతిపక్షం ఉందా? ఇంతకీ బఫూన్ అంటే బూతా? కాదంటారు జగన్, అయినా క్షమాపణకు పట్టుబడుతోంది పాలకపక్షమ్.

బఫూన్ అంటే ప్రజలను నవ్వించే విదూషకుడు అని, ఆ మాట చెప్పిన వారే సెలవిచ్చారు. విదూషకుడు అంటే తిట్టా? కాదే. ఓ రకంగా ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తూ, వినోదాన్ని పంచుతూ వారి బాధలనుండి విముక్తి కల్గించే వాడు విదూషకుడు. సమస్యల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆశల హరివిల్లు ఎక్కలేక, దరిద్రంతో దోబూచులాడుతున్న ఆమ్ ఆద్మీ కి విదూషకుడు ఓ గొప్ప నేస్తం. త్రిశంకు స్వర్గంలో ఉన్నామన్న భావనను మరిపించి, నిజమైన స్వర్గాన్ని దగ్గరలో చూపించే ఓ అద్దం.  నవ్వించి, ఆడించి, కేరింతలు కొట్టించి సామాన్య ప్రజల రోదిస్తున్న గుండెల్ని సైతం తేలేటట్టు చేసే ఓ మాయలోడు. నిజమైన చేదు వార్తను తీపి కోటింగ్ ఇచ్చి మనలో ఎక్కించే MBBS లేని వైద్యుడు.

మరి ఇంత మంచి వ్యక్తిని బూతుగా మార్చేసినారేంది సామీ. రాజకీయుల తిట్లకు వేరే పేర్లు దొరకలేదా? ఓ సినిమాలో ఓ స్వామీజీ ఆశీర్వాదం చేస్తే వాడు నాశనమై పోతాడు అని ప్రజల భయం. తను తిడితే బావుంటాడు అని నమ్మకం. అందరూ అడిగిమరీ తిట్టించుకుంటారు ఆ సామి దగ్గర. అలాంటి పరిస్థితే ఇక్కడ.

కాని, జగన్ను మెచ్చుకోవాలి. మంత్రులపై ఎంత కొపమున్నా ఓ మంచి పదంతో తిట్టాడు. (తిట్టినట్లు అనుకుంటున్నాడు). ఇదే అవకాశంగా పాలకపక్షం కూడా ఎగిరి గంతులేస్తున్నారు.  ఈ అద్భుత అవకాశం అందిపుచ్చుకున్నందుకు జగన్ కు 'విదూషక శిఖామణి' లాంటి బిరుదు ఇవ్వాలి...! 

Friday, January 17, 2014

నేనొక్కడినే... కాను!





'1.. నేనొక్కడినే' సినిమా చూడకముందు పేస్ బుక్  లో ఓ కామెంట్ చూసా . ' ఈ సినిమా చదువుకున్న వారికి మాత్రమే అర్థం అవుతుంది' అని. దానికి ప్రతి కామెంట్ ఏమంటే: 'అంటే మహేష్ సినిమా చూడాలంటే డిగ్రీ చేసి రావాలా?'

నవ్వుకోడానికి బాగానే ఉంది కాని, ఈ కామెంట్ నిజ్జంగానే విలువైనధి. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఇధి. ఎదుగుతున్న సాంకేతిక విలువలకు అద్దం పడుతున్న సినిమా. హాలీవుడ్ అంటే పెద్ద సీన్ కాదని, మనం చెయ్యగలిగే స్థాయేనని నిరూపించారు డైరెక్టర్ సుకుమార్.

ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తీయాలని అనుకున్నప్పుడు, ఆ సూపర్ స్టార్ యొక్క అభిమానుల గురించి, అతని చుట్టూ ఉన్న ఇమేజ్ అనే వలయం గురించి మామూలుగా అందరూ ఆలోచిస్తారు. సుకుమార్ కాని, మహేష్ కాని, ఇలాంటి చిన్న చిన్న విషయాలను దాటి ఆలోచించగలిగారంటే అది మన టాలివుడ్ కి శుభ పరిమాణం.

ఇక సినిమాకి వస్తే, ఓ వ్యక్తి ఊహా జనిత ఆలోచనలకు, అతని మానసిక అవస్థలకు అద్దం పట్టే కథ. తన తల్లి తండ్రులను ఎవరో చంపేశారని బలంగా నమ్మే వ్యక్తి వారిని చంపాలనుకుంటాడు. పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ముక్కూ మొహం తెలియని వారిని గుర్తించడం ఎలా, చంపడం ఎలా?  తను ఊహించుకుంటున్న విషయం నిజమా, అబద్ధమా అని కూడా పదే పదే అడిగి తెలుసుకునేంత కన్ఫ్యూస్ అయిన వ్యక్తి మన హీరో. తను అబద్ధం అని రాజి పడి సర్దుకునే సమయంలో తన గతానికి సంబంధించిన విషయాలు నిజాలుగా తేలుతాయి. తన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తాడు. గోవా వెళ్తాడు, ఐర్లాండ్ పోతాడు, విల్లన్లను పట్టుకుని చంపేస్తాడు. తల్లితండ్రుల గురించి తెలుసుకుని, వాళ్ళ ఆశయాలను కాపాడుతాడు. కథ ఎంత క్లిష్టమైనదో, కథనం అంత వైవిధ్యం. నగిషీలు దిద్ది దర్శకులు తీర్చి దిద్దిన విధం అద్భుతం.

ఒక్కటే విషయం. చందమామ కథల నుండి, యక్ష ప్రశ్నల వరకు, అన్నిట్నీ అందరికీ అర్థం అయ్యే విధంగా ఒకే సారి చెప్పడం చాల కష్టం. ఒక్కొక్కరి గ్రాహక శక్తీ ఒక్కో విధంగా ఉంటుంది. మరి సుకుమార్ ప్రయత్నం ఓ మేధావి వర్గాన్ని మాత్రమే ఆకట్టుకోవడానికే అనుకుంటే ఎలా? డివైడెడ్ టాక్ నుంచి బావుంది అనే మాట రావడానికి కేవలం రెండు రోజులే పట్టింది. సో, సినిమా నచ్చింది అని చెప్పేవాడిని నేనొక్కడినే కానేమో?  మొత్తానికి, ఈ సినిమా అర్థం కాలేదంటే నేను మేధావిని కానేమో అని ప్రేక్షకులు భయపడైనా ఒప్పెసుకునేట్టు ఉంది..!

సుకుమార్ కి, మహేష్ కి మాత్రమే కాక, నిర్మాతలకు కూడా ఈ కీర్తిలో భాగం ఉంది. ధైర్యం ప్రదర్శించి నిర్మాతలు కూడా శభాష్ అనిపించుకొన్నారు.  'తెలుగులో మంచి సినిమాలు రావు' అని పొరుగు రాష్ట్రాలను కీర్తిస్తూ మనోళ్ళను దెప్పిపొడిచే ఓ సామాన్య ప్రేక్షకుడా, దృక్పధం మార్చుకొని మరోసారి సినిమా చూడు.


మూసలను పగులకొడదాం. కొత్త ప్రయత్నాన్ని స్వాగతిద్దాం..! 

Tuesday, April 16, 2013

రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!


రవాణా రాష్ట్రం... రావణ కాష్టం...!

వేగం పుంజుకున్నది, మార్గం సుగమమైనది, రాష్ట్రంలో అందరూ ఏదో ఒక బాట పట్టారు.

ధర్మం ఎన్ని కాళ్ళపై నడుస్తుందో కాని, ప్రతి ఒక్కరు ఎక్కడో నడుస్తూనే ఉన్నారు. మండుటెండలు రోడ్డు పైనున్న తారును కరిగిస్తుంటే, మాయదారి మాటలతో మన నాయకులు రోడ్డెక్కి ప్రజల మనసులను కరిగించే పనిలో పడ్డారు. 




'మీకోసమే' అంటూ బాబన్న పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలురాయి దాటింది. చెల్లెమ్మ నడక ఊరూరా సాగి, రాజన్న రాజ్యాన్ని కాంక్షిస్తున్నది. కిరణ్ బాబు 'ఇందిరమ్మ కలలను' సాకారం చేయడానికి ప్రతి జిల్లాలోనూ మారుమూల దళితవాడను ఎంచుకొని పరుగులు సాగిస్తున్నాడు. తెలంగాణా రాష్ట్ర సమితి వారు బస్సు యాత్ర చేపట్టాలనుకుంటే, ఆ ప్రాంతానికే చెందిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళ కారు ఎక్కేదానికి సిద్ధపడ్డారు.  కమ్యునిస్టులు, పరివార్ మిత్రులు అరుదుగా కలిసి ప్రభుత్వాన్ని కలిసి వ్యతిరేకిస్తున్నారు, విద్యుత్ చార్జీల విషయమై రోడ్డెక్కారు.










ఏది ఏమైనా, విస్మయం కలిగే రీతిలో అన్ని పార్టీల నాయకులు చంచల్ గూడ దారి పట్టారు, తృణమో పణమో 'జన నాయకునికి' ముట్ట చెప్పడానికి, గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తూ.




నడక మంచిదని ప్రతి ఒక్కరూ అంటారు. డాక్టర్లు సలహా ఇచ్చేది కూడా ఇదే. ఇదేమి గోలో కాని, అందరు నాయకుల డాక్టర్లు ఒక్కసారిగా ఇలా సలహా పడేసినట్లున్నారు. అంతా నడక మయం.  కాని ఇంట్లో గడవక, లైట్లు మండక, చేలో మోటర్లు నడవక, నింగినంటిన ధరలకు నిత్యావసర వస్తువులు కొనలేక, పిల్లలను చదివించుకోలేక సామాన్యుడు మాత్రం ఎటూపాలుపోక దిక్కు తోచని స్థితిలో నడుస్తూనే ఉన్నాడు. చావును వెతుక్కుంటూ. కాని ఈ నడక మన మాధ్యమాలకు అవసరం లేని నడక. అందుకే ఇది ఏ పేపర్లోనూ, ఏ చానేల్లోను కనపడదు.

'నడుస్తున్నది' రవాణా రాష్ట్రమా, లేక రావణ కాష్టమా?

Friday, April 20, 2012

సీమలో కిరణ్, జగన్ పరిస్థితేంటి?




2009 తర్వాత అటు తెలంగాణా పై అనిశ్చితి, ఇటు జగన్ వేగానికి కళ్ళెం వేయలేకపోవడం, రెండూ చేరి కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లోతు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. వైఎస్సార్ మరణానంతర అనిశ్చితి తొలగడానికి ఓ పెద్ద మనిషిగా కొణిజేటి రోశయ్యను ముఖ్య మంత్రిగా చేసినా, అది పరిస్థుతులు సర్దుకొనేంతవరకే అవసరమైంది. ఆ "జంట అలజళ్ళను" తట్టుకోడానికి రోశయ్య చేసింది పెద్దగా ఏమి లేదు. ఆయన "అంతటి శూరుడు" అని తనూ కలగన లేదు, అధిష్టాననికీ అంత అభిప్రాయం లేదు. అప్పటి పరిస్తుతుల్లో నాన్చివేత ఒక్కటే సరైన మార్గంగా కాంగ్రెస్ ఎన్నుకొంది. కాని, తర్వాతి రోజుల్లో, పార్టీని 2014 ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఒక బలమైన నాయకుడు అవసరం అనీ, అతను తెలంగాణకు, జగన్ కు కలిపి చెక్ పెట్టేవాడిగా ఉండాలని అనుకొంది. తెలంగాణా, సీమ ప్రాంతాల్లో విజయాన్నినిర్దేశించగల ధనబలం, కండబలం ఇంక సంఖ్యాబలం గల సామాజిక వర్గం రెడ్లే. అందులోను ఒక యువ నాయకుడిని తీసుకుంటే, అటు తెలంగాణా రెడ్లను ఉద్యమం నుంచి దూరం చేయొచ్చు, ఇటు సీమలో జగన్ వైపు మొగ్గుతున్న రెడ్లను పార్టీ వైపు తిప్పుకోవచ్చు, అనే 'రెండు వైపులా పదునైన కత్తిగా' నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని హై కమాండ్ ఎంచుకొంది. కాని ఆ పాచిక పారలేదు.


సొంత పార్టీ వారే కిరణ్ పై అపనమ్మకం పెంచుకోనేటట్లు కిరణ్ వ్యవహార శైలి తయారైంది. ఎప్పుడూ తనకంటూ ఓ వర్గం లేని కిరణ్, ఎవ్వరిని దగ్గర చేర్చిన పాపాన పోని కిరణ్, ఇప్పుడు ముఖ్య మంత్రిగా 'అందరివాడు'గా ఉండాల్సినప్పుడు, ఎవ్వరికీ 'చెందనివాడు'గా తయారయ్యాడు. హైదరాబాద్ నుండి తన పీలేరు నియోజకవర్గంలోని సొంతూరు నగరిపల్లెకు వెళ్ళాలన్న కూడా, తిరుపతికి విమానంలో వచ్చి, పదిమందిని పలకరించి అక్కడనుండి పీలేరు వెళ్ళడు. హైదరాబాద్ నుండి నేరుగా బెంగళూరుకు విమానం పట్టుకొని, అటునుంచి మదనపల్లె మీదుగా పీలేరుకు వస్తాడు. తన సొంత జిల్లాలో కూడా ఆయనకు పట్టులేకపోవడానికి అదే కారణం. వై.ఎస్.ఆర్ నీడన పెరిగిన ఆయన ఇంత ఎత్తుకు ఎదుగుతామని, తనకంటూ ఓ వర్గం అవసరం అవుతుందనీ బహుసా అనుకోలేదేమో!

సీమలో, ప్రత్యేకించి కడప జిల్లాలో, రెడ్డి సామాజిక వర్గం ఇన్నేళ్ళు కాంగ్రెస్ కు వత్తాసు పలికినా, ఇప్పుడు ఎకతాటిపైన జగన్ కే మద్దతు పలికే అవకాశం మెండుగ ఉంది. కిరణ్ వెర్సస్ జగన్ అన్న పరిస్థితి వస్తే: ఇద్దరూ రెడ్లే, ఇద్దరూ దాదాపుగా యువకులే. జగన్ పెద్దాయన ఆస్తికి వారసుడైతే, కిరణ్ వై.ఎస్.ఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు దిద్ధినవారు. ఇంకా చెప్పాలంటే వై.ఎస్.ఆర్ కిరణ్ తండ్రి నల్లారి అమరనాథ రెడ్డికే సన్నిహితుడు. మరి ఈ సామాజిక విభజన ఎందుకు? ఈ వర్గానికి కాంగ్రెస్ ఏమి తక్కువ చేసిందని ఈ అలక? లేదా, జగన్ ఏమి చేస్తాడని వారి ఆశ, ఎదురుచూపు? ఇంకా చెప్పాలంటే, వై.ఎస్.ఆర్ తమ వర్గానికి చెసిన "మేలుకు" ప్రతిఫలంగా ఆయన ఋణం తీర్చుకోడానికి జగన్ కు వోటు వేయొచ్చు.


మరో వైపు ఓదార్పు పేరుతో జనం మధ్యన తిరుగుతున్న జగన్ కు అంతటా గుర్తింపు పెరుగుతోంది. అతని పైనున్న అవినీతి ఆరోపణలను నిరూపించి ముద్దాయిగా ప్రజల ముందు నిలిపే అవకాశమున్నా కాంగ్రెస్ తాత్సారంతో విఫలమయింది. దానితో "తనను వేదిస్తున్నారనే" జగన్ వాదనే నెగ్గే పరిస్థితి ఉంది.

ఈ సమస్యకు మరో పార్శ్వం ఏమంటే: పార్టీలో కోవర్టులు ఉన్నారని కొందరంటే, అది సిఎంకి కూడా వర్తిస్తుందని ఇంకొందరు గుసగుసలాడుకొంటున్నారు. జగన్ పై పల్లెత్తు మాట మాట్లాడని వైనం, తమను, తమ పార్టీని అనునిత్యం 'ఎక్కిదిగే' సాక్షి దినపత్రికకు వంద కోట్లకు పైగా ప్రకటనలు ఇవ్వడం వెనుక మతలబు కూడా ఇదేనేమో? తెర వెనుక నడుస్తున్న బాగోతం ఏమిటి? కిరణ్ లో నాయకత్వ లక్షణాలు లేవా, లేక ఆయన అది ప్రదర్శించ లేక పోతున్నారా? ఏది నిజం? పైపైకి హై కమాండ్ ను మచ్చిక చేసుకున్నా, లోలోపల జగన్ కు మేలు చేస్తున్నారా? కాంగ్రేస్ లో ఇతర కులాలకు చెందిన సీనియర్లు కుమిలిపోతున్నారు. నల్గొండలో ఈమధ్య డీసిసి అధ్యక్షుడు అన్నట్లు ఎవరు మనవారో, ఎవరు ద్రోహులో అర్థం కాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ లో. అది రాయలసీమకు కూడా వర్తిస్తుంది.

ఉప ఎన్నికలలో ఎవరిది వాపో ఎవరిది బలుపో తేలిపోతుంది!

Sunday, March 20, 2011

ఉన్మాదానికి మూగ సాక్షులు

ఉన్మాదానికి మూగ సాక్షులు



 


ట్యాంకు బండపై గంభీరంగా నిలిచి, హైదరాబాద్ నగరానికి తెలుగు కళను తెచ్చిన మహామహుల విగ్రహావళి. వాటికి మనం ఈ మధ్య అర్పించిన నివాళి ఎంతో ఘనం. మన గతాన్ని గౌరవించలేదు, భవిష్యత్తుకూ మంచి సందేశం ఇవ్వలేదు. మన సాంస్కృతిక పురోగామనానికే తిరోగమనం ఆ దుర్దినం.



అవి పలుకలేని మూగ విగ్రహాలే కావచ్చు. కాని వారికి తెలంగాణను మించిన చరిత్ర ఉంది. ఆ శిలలు  ప్రాంతీయతలను మించిన స్ఫూర్తి అందిస్తాయి. తిక్కన, నన్నయ, ఎర్రాప్రగడలకు తెలుగు తెలుసు, తెలుగు ప్రజలు తెలుసు, కాని తెలుగు మాట్లాడే ప్రాంతాలలో ఉప ప్రాంతాలు తెలియవు. అంటే ఏ కారణంతో వారి విగ్రహాలు కూల్చారో కూడా తెలియని స్థితిలో వారు కూలి ఉన్నారు. కొందరైతే హుస్సేన్ సాగర్ లో మునిగి ఈ ఉన్మాదం వెనుక గల కారణాలను ఆలోచిస్తుంటారేమో? వీరిని ముంచితే తెలంగాణా ఎలా వస్తుందో కూడా వారికి అంతుపట్టదు.





కాని, తెలంగాణా ప్రాంతంలో కూడా నిస్పక్షపాతంగా ఆలోచించే సాహితీ వేత్తలు, మేధావులు ఉన్నారు. వారు లోలోపల ఈ దుశ్చర్యలపై కుళ్లుకున్నా బయట చెప్పడానికి సాహసించడం లేదు. ఇది పరోక్షంగా ఇలాంటి వారికి మద్దతు పలకడమే అవుతుంది. ఇదే బయటపడే సమయం. ప్రాంతాలకతీతంగా తెలుగు మన అందరి సొత్తు. భాష, సంప్రదాయం, సంస్కృతి మనందరికీ సొంతం. వాటిని పరిరక్షించడంలో ఈ ఘనకీర్తులు పోషించిన పాత్ర గణనీయం. దాన్ని ప్రతి ఒక్కరూ ఆమోదిస్తారు. యాసలు, అలవాట్లు మారొచ్చు. అంత మాత్రానికే ఆ పెద్దలు వారసత్వంగా ఇచ్చిన మన సంస్కృతిని మరచి వారి విగ్రహాలనే కూలగొడితే తల్లినే నరికిన అంత పని కాదా?

ఇంకో పక్క, సంగారెడ్డిలో తెలంగాణా తల్లి విగ్రహాన్ని కూల్చి తెలంగాణా వాదులే ఇలాంటి అగ్గికి ఆజ్యం పోసారు. . వాళ్ళ జిల్లా మంత్రితో  ఉన్న  సమస్యను పరిష్కరించుకోవడానికి, పాత ద్వేషాలతో రగిలిపోతున్నవారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పేరుకేమో 
తెలంగాణా వాదం. కాని కూలగోట్టిందేమో తెలంగాణా తల్లి విగ్రహం. ఇంతటి నీచానికి ఒడిగట్టిన వారు తమ ప్రాంతానికి, ప్రజలకు ఏం మేలు చేస్తారు?
 
కూలింది ఏ విగ్రహమైనా అది పతనమవుతున్న సామాజిక మానవీయ విలువలకు తార్కాణం.

Sunday, February 13, 2011

తెలుగు తల్లి ఎవరా?




కేసిఆర్ యొక్క అవివేకం నానాటికి బయటపడుతూ ఉంది. తెలంగాణా ఉద్యమంలో ప్రజలచేత నానాటికి చీదరించుకో బడుతున్నాడు. సీమోళ్ళని ఆంధ్ర వాళ్ళని తిట్టి పోసాక, ఇప్పుడు తెలుగు తల్లినే తిట్టడం ప్రారంభించాడు. మాట్లాడేది తెలుగు, చదివేది తెలుగు, వ్రాసేది కూడా తెలుగే, కాని తెలుగు తల్లి మాత్రం సీమాంధ్ర వాళ్ళ కల్పన అట!


మన దేశంలో ప్రతి రాష్ట్రం ఒక విభిన్న భాషకు, సంస్కృతికి, సాహిత్యానికి నిలయం. ప్రతి నాగరికతకు చిహ్నంగా ఆరాధ్య దైవంగా ఒక మాతృమూర్తిని ఎంచుకున్నారు. తమిళనాడుకు కాని, కర్నాటకకు కాని కేరళకు గాని తమ భాషకు ప్రతిరూపంగా కళలకు ప్రతీకగా ఒక తల్లి శిలావిగ్రహం ఉంటుంది. అలాగే మనకు కూడా. ఇది తెలంగాణా అయినా, రాయలసీమ అయినా కోస్తాంధ్ర అయినా అందరికీ శతాబ్దాలుగా ఉండేదే! కెసిఆర్  చదువుకున్నపుడు కూడా 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ' పాట పాడే ఉంటాడు.


ఇప్పుడు హటాత్తుగా తన తల్లిని తల్లి కాదు అని, "మా తల్లి వేరే ఆవిడ" అని చెప్పే అంత నీచ సంస్కృతిని ఏమనాలి? ఇది తన సొంత ప్రాంతంవారు కూడా హర్షించారు. అన్నదేదో అన్నాడు కాని, రేపు, మా భాష తెలుగే కాదు, దీనికి వేరే పేరు ఉందని కూడా అంటాడు. ప్రజలను (తెలంగాణా ప్రజలను అని నొక్కి చెప్పాల్సిన పని లేదు) దాదాపు దశాబ్ద కాలంగా యేమార్చిన ఈ నేత ఎంతకైనా తెగిస్తాడు అనడంలో సందేహం లేదు. ఈ మాయల ఫకీరు మాయలో ఇంకా పడేవాళ్ళు ఉన్నారా?


నీ తల్లి!
తిట్టలేదు కెసిఆర్. 'తెలుగు తల్లి ఎవరు?' అని అడిగావు కదా. దానికి ఇదే నా సమాధానం!!!!!

Monday, October 18, 2010

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచి ఏర్పాటయ్యేనా?

తిరుపతిలో హై కోర్ట్ బెంచ్ ఏర్పాటు పై జరుగుతున్న ఆందోళన పన్నెండు రోజులకు చేరుకొంది. తిరుపతిలో లాయర్లు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారట. అక్టోబర్ పంతొమ్మిదిన (మంగళవారం) రాయలసీమ ప్రాంతపు లాయర్లు అందరూ చేరి ఒక పెద్ద సమావేశం జరుపుచున్నారు. దాదాపు ముప్పై ఏళ్ళుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ సమావేశం రూపుదిద్దుకుంటుంది. ఇందులో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు మరియు కడప జిల్లాలకు చెందిన 60 బార్ అసోసియేషన్ల సభ్యులు పాల్గొంటున్నారు.

ఎక్కడో విసిరి పారేసినట్టు ఉండే ఈ సీమనుండి ప్రతి వాయిదాకు హైదరాబాదుకు వెళ్ళాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. పేద బతుకులు న్యాయం పొందాలన్నా ఖర్చే ! అందుకే అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చల్లా కొండయ్య మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో రాయలసీమ ప్రాంతంకోసం హై కోర్ట్ బెంచును ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. కాని, ఇంతవరకు అది ఆచరణకు నోచుకోలేదు. ఇప్పటి వేర్పాటు ధోరణుల వల్ల జరిగే అనర్థాలు ఎన్నెన్నో. మనం మేలుకోకపోతే ఈ ఒక్క అవకాశం కూడా కోల్పోవలసి వస్తుంది.

ఇది అడ్వొకేట్లకు చెందిన సమస్యగా మాత్రమే మనం పరిగణించ కూడదు. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి సమస్య. మేలుకొందాం. తిరుపతికి అందరూ తరలి వెళ్దాం.