Saturday, October 17, 2015

అమరావతి కి వందనాలు

ఏంది యోవ్!!  మొత్తం మీద రాజధానికి సిద్ధం అవతా ఉండారు అంతా.  మనోళ్ళు కూడా సంబరాలు చేసుకుంటా ఉండారు కుండలో నీళ్ళు పట్టుకుని, గోతాంలో మట్టి పోసుకొని. ఓ రెండ్రోజుల్లో మోడీ గారు వచ్చి పలక నాటి పోతే ఓ పదేళ్ళలో ఓ కొలిక్కి రావచ్చేమో కదా...!

యాడో మాగొప్ప రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని దివాలాకోరు దిశగా తోసింది విభజన.  అన్నం పెట్టె చెయ్యిని  అడక్కతినే పరిస్థితికి తెచ్చిండ్లా. మడికాడ పక్క కయ్యి వాడు నీళ్లు ఇమ్మంటేనే కసురుకునే రోజులు, ఇంకా పక్క రాష్ట్రం వాడు ఇస్తాడా? ఏంటికి ఇస్తాడు? ముందే మనకు కర్ణాటక మహారాష్ట్ర వాళ్ళతో పేచి ఉండాది, ఇప్పుడు ఎగదాల ఇంకో కొత్త రాష్ట్రం వచ్చింది కదా. ఇంకా అంతే సంగతులు... 

ఇంక వసతులు అంటారా, ఒక్కోటి తెచ్చుకోడానికి నానా పాట్లు పడాలి. యాభై ఏళ్ళలో తెచ్చుకున్నదంతా హైదరాబాద్ లో పెట్టించి ఎద్దులో లాభం యాడో పోయినట్లు అయింది. మళ్ళీ బొచ్చె పట్టుకొని బొచ్చు సర్దుకొని ఎలబారినారు మన రాజకీయ నాయకులు. ఏదో తెస్తారని మాత్రం అంతా బాగానే అనుకుంటా ఉండారులే. అదేదో హోదా అంట కదా... అది వస్తుందని, రాదని, రావొచ్చని, రాకపోయినా నష్టం లేదని, వస్తేనే అన్నీ అవుతుందని కాదని, ఇలా రకరకాలుగా అంతా మాట్లాడతా ఉంటె, పైనుండే పెద్ద గడ్డం ఆయన, అదేబా మోడీ గారు, నోరే తెరవడు. ఈయనేందో మన్మోహన్ సింగే  మేలు అన్నట్లుగా ఉండాదే..!

అంతా బాగానే ఉంది కాని, రాజధాని విశేషాల్ని సీమోళ్ళు మాత్రం బెరుగ్గానే చూస్తా ఉండారు. అదొస్తుంది ఇదొస్తుంది అని బాగానే ఊదరగొడతా ఉంటె వచ్చేదేందో  పోయ్యేదేందో  తెలియట్లేదు.  అమరావతి జపం కూసంత ఎక్కువైనట్లే ఉన్నా మళ్ళీ ఈ గలాటలు మొదటికే వస్తుందేమో, చూసుకోండి నాయుడు గారు...!

No comments:

Post a Comment